మొదటిది ఎప్పుడూ శాశ్వతంగా గుర్తుండిపోయే విషయమే !
పుట్టినప్పుడు తొలి అడుగు (అమ్మా నాన్నలకి గుర్తుఉంటుంది), బడిలో తొలి రోజు, టీనేజ్ లో తొలి ఆకర్షణ, ఉద్యోగంలో చేరాక తొలిజీతం, పెళ్లయ్యాక తొలి రోజులు, తొలి సంతానపు తొలకరి అడుగులు - ఆ అనుభవాలు మంచి అయినా, చెడు అయినా ముద్ర వేస్తాయి - చాలా బలంగా.
కోవిడ్ జీవితపు విలువని అందరికీ గుర్తు చేసింది. మొక్కలు పెంచడం, పువ్వులు పూయించడం (ప్రకృతి మాత పూయిస్తుంది కానీ మనమే చేశాము అనుకుంటాము) మొదలుపెట్టాము నేను, నా భార్య.
తొందరలోనే చిన్న భూమి కొనుక్కుని కూరగాయలు, పండ్లు పండించుకోవాలి అనే దిశలో అడుగులు వేశాము. ఊరికి దూరంగా చిన్న భూమి కొని సాగుకు సిద్ధం చేశాము.
భూమిలో తొలి పూజ, తొలిసారి భూమిని దున్నడం, మడులు కట్టడం, విత్తనాలు చల్లడం, నీరు పారించడం, కలుపు తియ్యడం అంతా అపురూపమే. చిరు మొలకలు వచ్చిన రోజు - మా లోపల ఎంత ఉద్వేగం అంటే - ఇంకొక సంతానం కలిగినంత.
కీరాలు, సొరకాయలు చిన్న పిందెలు వచ్చాయి. ఎగిరి గంతులు వేశాము. తరువాత 15 రోజుల్లో కోతకి వస్తాయి.
15 రోజుల తర్వాత వెళ్ళగానే సొర కాయలు కొన్ని సగం సగం తినేసి ఉన్నాయి, కీరాలు కూడా పూర్తిగా పాడయిపోయి ఉన్నాయి. పనివాళ్ళు చెప్పారు -"ఎలుకలు సొరకాయలు కొట్టేశాయి, నెమళ్లు కీరాలను తిని వెళ్లాయి" అని.
ఒక్కసారిగా మా ఉత్సాహం మీద నీళ్లు చిలకరించినట్టు అయ్యింది. సొంతగా కూరగాయలు పండించుకుని తిందాం అంటే ఈ ఎలుకలు, నెమళ్లు పొట్టన పెట్టుకున్నాయి అని తిట్టుకున్నాను.
తెలంగాణా లో చాలా పల్లెటూర్లలో నెమళ్లు విషపు గుళికలు తిని చనిపోయినట్లు చాలా సార్లు వార్తలు చదివాను. 'పరిస్థితి ఇలా ఉంటే రైతులు మాత్రం ఏం చేస్తారు?' అని అనిపించింది అప్పుడు నాకు.
మా నాన్న అప్పుడే కాల్ చేశారు. నిరాశగా తోటలో పరిస్థితిని చెప్పాను.
'ఇప్పుడు ఏమయింది, ఇన్ని జీవులకు తిండి పెట్టే అవకాశం నీకు ఇంకో రకంగా దొరుకుతుందా ? ఇలా పోషించే అవకాశం అమ్మవారు ఇచ్చారు. ఆనందించు' అన్నారు నాన్న.
"నిజమే ! నేను దుఃఖ పడకూడదు. శాంతిగా ఉండాలి. ఒక మామూలు మనిషిగా ఆలోచించకూడదు. ఒక అమ్మలానో, నాన్న లానో ఆలోచించాలి" అని తృప్తిగా నేల మీద కూర్చుండి పోయాను.